Pages

Wednesday, February 8, 2017

*సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం..!!*

*సనాతన హైందవ ధర్మంలో స్త్రీ స్థానం..!!*

సనాతన ధర్మశాస్త్రరీత్యా స్త్రీ ప్రకృతి స్వరూపినిగాను ధరణి(భూమాత) గాను గౌరవించటం పూజించటం జరిగింది..!
పరమాత్మ సైతం తనను రెండు భాగాలుగా విభజించుకుని అందులో రెండవ సగభాగం పరాశక్తికి ఇచ్చాడు..
నారాయణుడు సైతం లక్ష్మిని తన వక్షస్థలమున నిలిపాడు..!!

స్త్రీలందరూ మహా ప్రకృతియొక్క అంశలతో పుడతారని వారిని గౌరవించటం మన ధర్మమని..!
స్త్రీని దేవి స్వరూపంగా భావించి గౌరిపూజ కుమారిపూజ వంటి పూజలతో వస్త్రాలు అలంకారాలతో అర్చించటం పుణ్యప్రదమని మన సనాతన సంస్కృతి తెలుపుతుంది..!!

ధర్మార్థకామ్యమోక్షార్ది అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పితృఋణం.. దేవ ఋణం .. ఋషి ఋణాలనుండి ముక్తుడవుతాడు..
పురుషునకు సంతాన భాగ్యాన్ని విశేష గౌరవాన్ని అమృతత్వాన్ని ప్రసాదించేది భార్య మాత్రమే..!!

*"సఖా సప్తపదాభవ"*

స్నేహితలువలే ఇద్దరి మనసులు ఒక్కటికావాలి
ప్రేమానురాగాలతో జీవనం సాగించాలని కోరతారు..
వివాహ బంధంతో స్త్రీ తన జీవితాన్ని భర్తకు అర్పించటం మాత్రమే కాదు..
పురుషుడు సైతం తన సర్వస్వాన్ని తన జీవిత భాగస్వామికి అందిస్తాడు..!!

*"మూర్దానాం పత్యునారోహ"*

జీవికి శిరస్సు ఎంత ప్రధామైనదో
పురుషునకు స్త్రీ కూడా శిరస్సువలే ప్రధానమైనది..
శిరస్సు లేకుండా జీవించటం ఎంత అసాధ్యమో
భార్య లేని పురుషుడు కుడా శిరస్సు లేనటువంటి వాడే..!!

*"మమ హృదయే హృదయంతే అస్తు"*

నా హృదయం లో నీ హృదయం నా చిత్తం లో నీ చిత్తం మమేకమై ప్రేమభావముతో జీవించెదరు..!!

*" కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి "*

దాసిగా సేవచేస్తూ.. మంత్రిగా సూచిస్తూ.. తల్లిగా పాలిస్తూ.. రంభగా లాలిస్తూ.. ధరిత్రిగా క్షమిస్తుంది భార్య..!!
అనేక విధాలుగా భర్తకు సేవ చేస్తుంది ..
సేవ చేస్తుందని సేవకురాలు కాదు తానే ఇంటి యజమానురాలు..!!
తల్లిగా సేవచేసే లక్షణం వారికి జన్మతః వస్తుంది
కనుకనే ప్రతీ స్త్రీలో మాతృమూర్తిని చూడగలుగుతున్నాం..!!

దేవ ఋషి పితృ ఋణాలు తీర్చవచ్చునుగాని
మాతృఋణం తీర్చలేనిది
చెడ్డ కొడుకు పుట్టవచ్చునేమో కాని చెడ్డ తల్లి ఉండదు
తల్లిని వదిలేసిన సంతానం ఉంటుందిగాని
తల్లి వదిలేసిన సంతానం ఎవరు ఉండరు..!
మోక్ష మార్గాన్ని చూపే గురువుకన్నా
మోక్షస్వరూపమైన తండ్రికన్నా
జన్మనిచ్చిన తల్లి భుమికన్నా విలువైనది
తల్లిని పూజించటం కంటే గొప్ప పూజంటు లేదు..!!

*ఉపనయనంలో ముందుగా తల్లికే మాతృభిక్ష యాచించటం జరుగుతుంది .. సన్యాసించిన వారు ఎవరికి నమస్కరించకూడదు కాని తల్లికి నమస్కరించాలి... తల్లి ఋణం తీర్చలేనిది.. తల్లి శాపం త్రిప్పలేనటువంటది అనుభవించక తప్పదు.. తల్లిని గౌరవించకపోయినా హీనంగా చూసినా లేదా వృద్ధాప్యం లో వదిలేసిన రౌరవాది నరకాలు తప్పవని శాస్త్రాకర్తలు వాక్యానించారు..!!*

*" యత్ర నార్యస్తు పూజ్యంతే రమ్యతే తత్ర దేవతాః"*

ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో(గౌరవించబడతారో) అక్కడ దేవతలు క్రీడిస్తారు (సంతోషంగా నివసిస్తారు)..!!

*"కలకంఠి కన్నీరొలికిన సిరియింటనుండనొల్లదు సుమతీ"*

స్త్రీ కంట కన్నీరు వచ్చిన క్షణం గృహంలో లక్ష్మి నివసించదు

*"సగృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే గృహంతు గృహీణీహీనం అరణ్యం సదృషం భవేత్"*

స్త్రీ గృహంలో నివసిస్తుంది కనుకనే గృహము అనబడింది
స్త్రీ లేని గృహం అరణ్యంతో సమానం..!!

స్త్రీని అగ్నితో పోల్చారు..
అంటే అగ్ని ఎంత పవిత్రమైనదో స్త్రీ అంతే పవిత్రమైనది ..
పరస్త్రీ ని తల్లిగా చెల్లిగా చూడాలని..
తల్లి అని సంబోధించాలని మన సంస్కృతి తెలుపుతుంది..!!

స్త్రీ దేవతలను పూజించే ఆచారం ఏ సంస్కృతిలోనైనా ఉందా అంటే అది కేవలం సనాతన ధర్మానికి మాత్రమే సొంతం..!!
స్త్రీలకు ఇంతటి గౌరవాన్నందించిన సనాతన ధర్మంలో జన్మించిన ప్రతీ ఒక్కరు ధన్యజీవులే కదా..!!

No comments:

Post a Comment